మదనపల్లె, ఆగస్టు 15:( gtvmedia)కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్న శ్రీ శక్తి పథకం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాష శనివారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.

ఈ సందర్భంగా బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలను ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించి, శ్రీ శక్తి పథకం ద్వారా వారు పొందుతున్న ప్రయోజనాలు, పథకంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మహిళలతో చర్చించారు.
అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల మనోభావాలను గౌరవిస్తోందన్నారు. రూ.4 వేల పింఛన్, ఉచిత గ్యాస్ సిలిండర్లు, రైతు భరోసా, తల్లికి వందనం, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం వంటి పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు చేరువవుతోందని తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని ఎమ్మెల్యే విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా పాలన కొనసాగుతోందని, రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించేందుకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ప్రజలు ఆదరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం, డిపో మేనేజర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
