హెల్మెట్ లేకుండా ప్రయాణించొద్దు: వక్తలు
మదనపల్లె, ఆగస్టు 19: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మాజీ సైనికుడు శ్రీనివాసులు నాయుడు కుమారుడు కంచర్ల మధు స్మారక కార్యక్రమం మదనపల్లెలోని ఎన్వీఆర్ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పలువురు ప్రముఖులు పాల్గొని మధుకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మధు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. యువత ద్విచక్ర వాహనాలపై దూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రాణాలకే ప్రమాదకరమని హెచ్చరించారు.
రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని, వేగాన్ని నియంత్రించడంతో పాటు హెల్మెట్ ధరించడాన్ని ప్రతి ఒక్కరూ అలవాటుగా చేసుకోవాలని కోరారు. ఒక్క క్షణం నిర్లక్ష్యం కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెడుతుందని పేర్కొన్నారు.
మధు మృతి ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వక్తలు ప్రార్థించారు.
