మదనపల్లెలో ‘హోంగార్డ్స్ దర్బార్’ నిర్వహణ

పోలీస్ వ్యవస్థలో హోంగార్డుల సేవలు అత్యంత కీలకం: – హోంగార్డ్స్ కమాండెంట్ ఏ. హనుమంతు

మదనపల్లె, సెప్టెంబర్ 03: మదనపల్లెలోని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో రాయలసీమ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ ఏ. హనుమంతు ‘హోంగార్డ్స్ దర్బార్’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ వ్యవస్థలో హోంగార్డులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.

ప్రతి ఒక్కరూ విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ పాటిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచాలి. విధి నిర్వహణలో ప్రజలతో స్నేహపూర్వకంగా, మర్యాదగా వ్యవహరించాలి.

సమాజానికి సమర్థవంతంగా సేవ చేయాలంటే ముందుగా సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

సిబ్బంది శారీరక, మానసిక దృఢత్వం కోసం ప్రతిరోజూ యోగా, మెడిటేషన్ (ధ్యానం) చేయాలని ఆయన సూచించారు.

ప్రయాణ సమయాల్లో ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలి. రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ లైసెన్స్, వాహన బీమాతో పాటు వ్యక్తిగత జీవిత బీమా తప్పనిసరిగా కలిగి ఉండాలి.

దర్బార్‌లో బ్యాంక్ సిబ్బంది ద్వారా యాక్సిడెంటల్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్‌పై హోంగార్డులకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలైన పీఎంజెజెవై, పీఎంఎస్బివై పాలసీలు ఆటంకం లేకుండా రెన్యువల్ అయ్యేలా సిబ్బంది తమ బ్యాంకు ఖాతాల్లో సరిపడా నగదు ఉంచుకోవాలని సూచించారు.

సిబ్బంది తమకున్న పలు సమస్యలను దర్బార్‌లో కమాండెంట్ గారి దృష్టికి తీసుకురాగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఆ సమస్యలన్నింటినీ జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కారం దొరికేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ (హోంగార్డ్స్/ఏంటిఓ) కె. సురేష్ కుమార్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ (వెల్ఫేర్) ఎం. రవికుమార్, ఏఆర్ఎస్ఐ బాలాజీ, ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్ళు రమేష్, లక్ష్మిరెడ్డి మరియు పెద్ద సంఖ్యలో హోంగార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *