త్యాగధనుడు ఆంధ్రకేసరి జీవితం యువతకు ఆదర్శం: కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లె, ఆగస్టు 23: (gtvmedia)ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అడుగుజాడలు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు.
మదనపల్లె కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో బ్రిటిష్ పోలీసులకు ధైర్యంగా ఎదురొడ్డి నిలిచిన మహనీయుడు ప్రకాశం పంతులు అని కొనియాడారు. ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు.
ప్రకాశం పంతులు చూపిన దేశభక్తి, ధైర్యం, క్రమశిక్షణను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని మంచి పౌరులుగా ఎదగాలని కలెక్టర్ కోరారు.
కార్యక్రమంలో మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్ఓ వెంకటేశు, హౌసింగ్ పీడీ రమేష్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో శ్రావణి, మదనపల్లె ఎంఆర్ఓ మాధవి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
