తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్: ఎమ్మెల్యే షాజహాన్ భాషా
మదనపల్లి, ఆగస్టు 30: (gtvmedia)మదనపల్లి రూరల్ మండలం పొన్నూటిపాలెం గ్రామంలోని చిప్పిలి బంగారుపేట కాలనీలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా ఆవిష్కరించారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ.. తెలుగుజాతి గర్వించదగ్గ మహానాయకుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని తమ నియోజకవర్గంలో ఆవిష్కరించుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల సమక్షంలో ఎమ్మెల్యేగా పాల్గొనడం తన జీవితంలో దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు.

“ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక” అని ఎమ్మెల్యే అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పిన ఎన్టీఆర్ సేవలు, ఆయన సిద్ధాంతాలు ఎప్పటికీ చిరస్మరణీయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
