బాకరాపేట, ఆగస్టు 31: (gtvmedia)తిరుపతి సమీపంలోని బాకరాపేట ఘాట్ రోడ్డులో సోమవారం తెల్లవారుజామున పైపుల లోడుతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. మహారాష్ట్రలోని బరంపూర్ నుంచి పైపుల లోడుతో బెంగళూరు మీదుగా తిరుపతి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే లారీ నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. మంటలు వేగంగా వ్యాపించడంతో లారీతో పాటు అందులోని పైపులు పూర్తిగా కాలిపోయాయి.
అగ్నిప్రమాదం ధాటికి లారీ డీజిల్ ట్యాంక్, టైర్లు పేలడంతో భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు భయాందోళనకు గురై తమ వాహనాలను రోడ్డుపక్కన నిలిపివేశారు.
సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
