దళిత కుటుంబ భూమిపై కబ్జా యత్నం.. ఎస్పీకి ఫిర్యాదు

మదనపల్లె, ఆగస్టు 17: (gtvmedia)దళిత కుటుంబానికి వారసత్వంగా వస్తున్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీవైజీపీఎస్సెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల మల్లికార్జున ఆరోపించారు. బాధితులు రాచపల్లి చిన్నప్ప, రాచపల్లి రెడ్డప్ప కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

మదనపల్లె మండలం బండమీదకమ్మపల్లి పరిధిలోని సర్వే నంబర్ 521/1లో 2.78 ఎకరాల భూమి తమ కుటుంబానికి వారసత్వంగా వస్తోందని బాధితులు తెలిపారు. భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు తమ పేర్లపైనే ఉన్నాయని పేర్కొన్నారు.

అయితే సిటిఎం క్రాస్ రోడ్డుకు చెందిన ఆర్‌టీసీ శంకర్ రెడ్డి తప్పుడు పత్రాలు, నకిలీ నోటీసులు సృష్టించి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపించారు. కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఆరోపణలపై అధికారులు తక్షణమే విచారణ చేపట్టి, నిజానిజాలు తేల్చాలని ఆవుల మల్లికార్జున డిమాండ్ చేశారు. నకిలీ పత్రాలు నిజమని తేలితే ఫోర్జరీ కేసులు నమోదు చేయడంతో పాటు, కుల దూషణలు, బెదిరింపులు రుజువైతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని కోరారు.

బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి, రెవెన్యూ అధికారులు భూమిపై వాస్తవ పరిస్థితులను పరిశీలించి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గమనిక: భూమి కబ్జా, నకిలీ పత్రాలు, బెదిరింపులకు సంబంధించిన ఆరోపణలు బాధితులు, ఆవుల మల్లికార్జున చేసినవిగా మాత్రమే పేర్కొనబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *