అర్హులైన చేనేత కార్మికులకు పథకం ప్రయోజనం అందించాలి
మదనపల్లె, ఆగస్టు 17: (gtvmedia)రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నేతన్న సేవ’ పథకంలో అనర్హులను తొలగించి, అర్హులైన చేనేత కార్మికులకు మాత్రమే లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని చేనేత కార్మిక యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మదనపల్లె కలెక్టరేట్లో ఇన్చార్జి కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు.
చిన్నమండెం మండలం మల్లూరు పంచాయతీకి చెందిన చేనేత కార్మికులు మాట్లాడుతూ.. మల్లూరు సచివాలయం పరిధిలో ప్రస్తుతం 24 చేనేత మగ్గాలు మాత్రమే పనిచేస్తున్నప్పటికీ, 54 మంది లబ్ధిదారులు ఉన్నట్లు జాబితాలో నమోదు చేశారని ఆరోపించారు. మగ్గాలు లేని వారికి, అనర్హులకు కూడా పథకం ప్రయోజనం కల్పించినట్లు తమకు అనుమానాలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.
నేతన్న సేవ పథకం ద్వారా నిజంగా చేనేత వృత్తిపై ఆధారపడుతున్న అర్హులైన కార్మికులకు ప్రయోజనం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చేనేత కార్మిక యూనియన్ అధ్యక్షులు వెంకటేష్, ఉపాధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
అనర్హుల వివరాలను పరిశీలించి, అర్హులైన చేనేత కార్మికులకు న్యాయం చేయాలని వారు ఇన్చార్జి కలెక్టర్ను కోరారు.
ఈ కార్యక్రమంలో దినకర్, కుప్పయ్య తదితరులు పాల్గొన్నారు.
