మదనపల్లె, జూలై 31 (GTV MEDIA): నాయీ బ్రాహ్మణుల ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషాకు నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కార్పొరేట్ సెలూన్ల విస్తరణ కారణంగా స్థానిక సంప్రదాయ క్షవర వృత్తిదారులు ఉపాధి కోల్పోతున్నారని, ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే యువత ఆధునిక సెలూన్లు ఏర్పాటు చేసుకునేందుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సబ్సిడీ రుణాలు అందించడంతో పాటు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఆధునిక పరికరాల కొనుగోలుకు ప్రత్యేక ప్రభుత్వ పథకాలు, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ నాయకులు మంగళ ప్రభాకర్, బుర్ర రంగస్వామి, యనమల రామకృష్ణ, ముస్తూరి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
