మదనపల్లె, ఆగస్టు 31: పోలీస్స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పోలీసు అధికారులను ఆదేశించారు.
మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 71 ఫిర్యాదులు అందాయి. వీటిలో భూ వివాదాలు 30, ఆర్థిక వివాదాలు 10, ఘర్షణలు/న్యూసెన్స్ 10, మోసం/సైబర్ నేరాలకు సంబంధించినవి 7, కుటుంబ వివాదాలు 6, ఇతర సమస్యలు 5, పరిపాలనా సంబంధిత ఫిర్యాదులు 3 ఉన్నాయి.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భూకబ్జాలు, వడ్డీ వేధింపులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందించడంలో ఎలాంటి జాప్యం చేయరాదని స్పష్టం చేశారు.
ఫిర్యాదులపై విచారణను వేగంగా పూర్తి చేసి, సంబంధిత నివేదికలను వెంటనే జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు.
