మదనపల్లె, ఆగస్టు 11: (gtvmedia)రాబోయే వేసవిలో మదనపల్లె ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా మంగళవారం కోళ్లబైలు పంచాయతీ కాట్లాటపల్లి వద్ద హంద్రీ–నీవా కాలువ సొరంగాన్ని ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండినప్పుడు బ్యాక్వాటర్ను ఎత్తిపోతల పథకం ద్వారా అనంతపురం జిల్లా మీదుగా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెకు తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నీటిని భవిష్యత్ అవసరాలకు వినియోగించుకునేలా అవసరమైన మౌలిక వసతులను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
హంద్రీ–నీవా కాలువ సొరంగంతో పాటు కోళ్లబైలు, పనసాలపాలెం, చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల వద్ద నీటి నిల్వ, సరఫరాకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
వేసవిలో మదనపల్లె పట్టణం, పరిసర ప్రాంతాల్లో తాగునీటి కొరత రాకుండా ముందస్తు ప్రణాళికతో పనులు చేపట్టాలని, అవసరమైన చోట్ల కాలువలు, సొరంగాలు, నీటి నిల్వ కేంద్రాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
