నేతన్న సేవలో పథకంపై చేనేత కార్మికుల రాస్తారోకో

అర్హులైన వారికి న్యాయం చేయాలని డిమాండ్.. జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు

మదనపల్లె, ఆగస్టు 10:( gtvmedia)
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో చేనేత కార్మికులు సోమవారం రాస్తారోకో చేపట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న సేవలోపథకం లబ్ధిదారుల ఎంపికపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

మదనపల్లెలో అర్హత కలిగిన పలువురు చేనేత కార్మికులకు పథకం ప్రయోజనం దక్కలేదని, అర్హత లేని కొంతమందికి లబ్ధిదారుల జాబితాలో చోటు కల్పించారని కార్మికులు ఆరోపించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా చేనేత శాఖ ఏడి, వార్డు సచివాలయ సిబ్బంది లంచాలు తీసుకుని అనర్హులకు ‘నేతన్న సేవలో’ పథకాన్ని కేటాయించారని చేనేత కార్మికులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.

అర్హులైన చేనేత కార్మికులను గుర్తించి, వారికి రెండో విడతలో ‘నేతన్న సేవలో’ పథకం ప్రయోజనం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల ఎంపికపై సమగ్ర విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని కోరారు.

చేనేత కార్మికులు సుమారు గంటపాటు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *