1982-83 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

మదనపల్లె, ఆగస్టు 8: (gtvmedia)మదనపల్లె జడ్పీ హైస్కూల్లో 1982-83 పదో తరగతి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మదనపల్లె ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ, పాఠశాల రోజులు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనవని అన్నారు. తాము చదువుకున్న పాఠశాలలో విద్యను పూర్తి చేసి, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్న అనంతరం తిరిగి అదే పాఠశాలకు వచ్చి పూర్వ విద్యార్థులుగా కలుసుకోవడం ఎంతో ఆనందకరమైన విషయమన్నారు.
పాఠశాల జీవితంలో ఏర్పడిన స్నేహాలు, అనుబంధాలు జీవితాంతం గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత పూర్వ సహచరులంతా ఒకే చోట కలుసుకుని తమ పాఠశాల జ్ఞాపకాలను నెమరువేసుకోవడం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ పాఠశాల రోజులను గుర్తుచేసుకుంటూ ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. పాత మిత్రులను కలుసుకోవడం ద్వారా తమ విద్యార్థి దశలోని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
