2047 విజన్కు అనుగుణంగా జిల్లా ఆర్థికాభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి
తిరుపతి ఎకనామిక్ రీజన్ సీఈవో ముఖేష్ కుమార్ మీనా
మదనపల్లె, జూలై 31: (gtvmedia)
తిరుపతి ఆర్థిక ప్రాంత అభివృద్ధి ప్రణాళికలో భాగంగా అన్నమయ్య జిల్లా ఆర్థికాభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను శాస్త్రీయంగా రూపొందించాలని… ఆర్థిక అభివృద్ధిలో అన్నమయ్య జిల్లా కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం (గనులు) శాఖ ముఖ్య కార్యదర్శి మరియు తిరుపతి ఎకనామిక్ రీజన్ సీఈవో ముఖేష్ కుమార్ మీనా జిల్లా అధికారులకు సూచించారు.
శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో.. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం (గనులు) ముఖ్య కార్యదర్శి మరియు తిరుపతి ఎకనామిక్ రీజన్ సీఈవో ముఖేష్ కుమార్ మీనా అధ్యక్షతన.. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆధ్వర్యంలో… అన్నమయ్య జిల్లా ఆర్థికాభివృద్ధి కార్యాచరణ దిశపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఈవో ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ… స్వర్ణ ఆంధ్ర @2047 విజన్ అమలులో భాగంగా రాష్ట్రాన్ని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి అనే మూడు ఆర్థిక ప్రాంతాలుగా ప్రభుత్వం విభజించిందని తెలిపారు. తిరుపతి ఆర్థిక ప్రాంతంలో తొమ్మిది జిల్లాలు ఉన్నాయని.. అందులో అన్నమయ్య జిల్లా ఒకటన్నారు. 2047 నాటికి ఈ ప్రాంతాన్ని 0.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.
అన్నమయ్య జిల్లా భౌగోళికంగా బెంగళూరు, తిరుపతి నగరాలకు సమీపంలో ఉండటం వల్ల ప్రత్యేక అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత విలువవృద్ధి, పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్, పర్యాటకం, పునరుత్పాదక ఇంధన రంగం, విద్యా–నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఉన్న అవకాశాలను గుర్తించి, వాటిని దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికల్లో చేర్చాలని సూచించారు.
జిల్లాలో ఆర్థికాభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగం, ఐటీ పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు (MSMEs), పర్యాటక రంగం అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రోత్సాహం, స్థానిక వనరుల వినియోగం ద్వారా ఉపాధి అవకాశాల విస్తరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాకు అనుకూలమైన పరిశ్రమల అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
పరిశ్రమల స్థాపనకు అవసరమైన నీటి లభ్యత, విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. తదుపరి సమీక్షా సమావేశానికి ఈ అంశాలపై శాఖల వారీగా కార్యాచరణ నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలో అర్థవంతమైన ప్రాజెక్టులను గుర్తించి, వాటిని అమలులోకి తీసుకురావడమే లక్ష్యమని.. కేవలం నివేదికలకే పరిమితం కాకుండా, ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే అభివృద్ధి ప్రాజెక్టులుగా మారేలా ప్రణాళికలు రూపొందించాలని సీఈవో సూచించారు.
జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ మాట్లాడుతూ, స్వర్ణ ఆంధ్ర @2047 విజన్కు అనుగుణంగా అన్నమయ్య జిల్లాను అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని వివరించారు. వివిధ శాఖల ద్వారా నియోజకవర్గాల వారీగా అమలు చేస్తున్న ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు, జిల్లాలో ఉన్న వనరులు, పెట్టుబడి అవకాశాలు, అభివృద్ధి సామర్థ్యంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర వివరాలు అందించారు.
ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, సీపీఓ వెంకట పెద్దయ్య, వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధకం, మార్కెటింగ్, గనులు, జలవనరులు, పర్యాటకం, సిరికల్చర్, మత్స్య, చేనేత జౌళి, ఎనర్జీ, నెడ్కాప్ తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
