రాయచోటి, సెప్టెంబర్ 9: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా రాయచోటి పట్టణంలోని గాలివీడు రోడ్డులో ఉన్న టీడీపీ కార్యాలయంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి 53 దీపాలను వెలిగించారు. చంద్రబాబు నాయుడిని అర్థరాత్రి అరెస్ట్ చేసి, అనంతరం రోడ్డు మార్గంలో కోర్టుకు తరలించి 53 రోజుల పాటు జైలులో ఉంచిన ఘటనను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.

కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొని 53 దీపాలను వెలిగించారు. చంద్రబాబు అరెస్టు ఘటనను ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా టీడీపీ శ్రేణులు అభివర్ణించాయి.
చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలు, ఆయన అరెస్టు తదితర పరిణామాలను గుర్తు చేసుకుంటూ.. చివరకు న్యాయం, సత్యమే గెలిచాయని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
