ఎలక్ట్రానిక్ పరికరాల పరీక్షలు, కాలిబ్రేషన్పై ప్రత్యక్ష అవగాహన
మదనపల్లె,సెప్టెంబర్ :12 పరిశ్రమల సందర్శనల ద్వారా విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పారిశ్రామిక రంగంలో అనుసరించే విధానాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు మిట్స్ యాజమాన్యం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో ఈసీఈ విభాగానికి చెందిన మూడో సంవత్సరం బీటెక్ విద్యార్థులు చెన్నైలోని ఎలక్ట్రానిక్స్ టెస్ట్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ (ETDC), సెంటర్ ఫర్ రిలయబిలిటీ సంస్థలను సందర్శించారు.
ఈ పారిశ్రామిక సందర్శనలో మొత్తం 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ పరికరాల పరీక్షలు, కాలిబ్రేషన్, నాణ్యత హామీ, విశ్వసనీయత పరీక్షలు, ప్రయోగశాలల్లో అనుసరించే విధానాలపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించారు.
ఎస్టీక్యూసీ డైరెక్టరేట్ సెంటర్ ఫర్ రిలయబిలిటీ సంస్థకు చెందిన సైంటిస్ట్ ‘డి’ శుభం కుమార్ విద్యార్థులతో మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో ఉత్పత్తుల నాణ్యత, భద్రత, పనితీరు, విశ్వసనీయతను నిర్ధారించడంలో టెస్టింగ్, కాలిబ్రేషన్, క్వాలిటీ అష్యూరెన్స్ కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
భవిష్యత్తులో స్మార్ట్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రీ 4.0, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్ష సాంకేతికత, వైద్య పరికరాల వంటి రంగాల్లో ఎలక్ట్రానిక్స్ నిపుణులకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని వివరించారు.
అనంతరం విద్యార్థులు ఎలక్ట్రో టెక్నికల్ ల్యాబొరేటరీ, క్వాలిటీ అష్యూరెన్స్ విభాగం, టెంపరేచర్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీ, ఎక్విప్మెంట్ ల్యాబొరేటరీలను సందర్శించారు. ఆయా ల్యాబొరేటరీల్లో నిర్వహిస్తున్న వివిధ పరీక్షలు, కాలిబ్రేషన్ ప్రక్రియలు, పరికరాల నాణ్యత పరిశీలన, విశ్వసనీయత నిర్ధారణ విధానాలను విద్యార్థులు ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ పారిశ్రామిక సందర్శనలో ఈసీఈ విభాగానికి చెందిన డాక్టర్ అనురాగ్ కుమార్ పాండే, అసిస్టెంట్ ప్రొఫెసర్ జి. చరణ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్. ఆయేషా భానుతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
