రైతులకు అందుతున్న ప్రభుత్వ పథకాల ప్రయోజనాలపై ఆరా
పీలేరు, సెప్టెంబర్ 18: జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం పీలేరు మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి డ్వామా ఆధ్వర్యంలో చేపట్టిన పనులను పరిశీలించారు.
పీలేరు మండలం కావలిపల్లిలో డ్వామా ఆధ్వర్యంలో చేపట్టిన సంకన్ పాండ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. వర్షపు నీరు వేగంగా ప్రవహించకుండా ప్రవాహ వేగాన్ని తగ్గించి, నీటిని కొంతసేపు నిల్వ ఉంచేలా వాగులు, వంకల్లో నిర్మిస్తున్న ఈ తరహా నీటి సంరక్షణ పనుల వల్ల భూగర్భ జలాల పెంపుదలకు, నీటి నిల్వకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు కలెక్టర్కు వివరించారు. పనుల నాణ్యత, ఉపయోగకరతపై కలెక్టర్ ఆరా తీశారు.
సామూహిక పశుగ్రాస సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. భూమి లేని పాడి పశువుల రైతులు కూడా భూమి ఉన్న రైతుల నుంచి భూమిని అధికారిక ఒప్పందం ద్వారా తీసుకుని పశుగ్రాసం సాగు చేసుకునే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
ఈ కార్యక్రమంలో డ్వామా పిడి వెంకటరత్నం, పశుసంవర్ధక శాఖ జెడి గుణశేఖర్ పిళ్ళై, జెడిఏ హరిప్రియ, ఏపీసీఎన్ఎఫ్ డిపిఎం వెంకట మోహన్, ఉద్యానవన అధికారి సుకుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఏవో రమాదేవి, అయ్యా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
