ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా రామసముద్రంలో ‘ఇంటింటికి తెలుగుదేశం’.. ప్రజలకు సంక్షేమ కరపత్రాల పంపిణీ

మదనపల్లి, సెప్టెంబర్ 2: మదనపల్లి నియోజకవర్గంలోని రామసముద్రం మండలంలో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం పల్లె పండుగ వాతావరణంలో జరిగింది. అరికెల, మానేవారిపల్లి, మాలేనత్తం గ్రామపంచాయతీల్లో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు.

‘మారుమూల పల్లెలకూ సంక్షేమ పథకాలు’

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా మాట్లాడుతూ.. మారుమూల పల్లెల్లో నివసించే ప్రజలకు సైతం సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు.

గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసినప్పుడు పలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నామని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. వృద్ధులు, వితంతువులు తదితరులకు పెన్షన్లు అందుతున్నాయని, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ‘తల్లికి వందనం’ నిధులు జమయ్యాయని పేర్కొన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని ఎమ్మెల్యే తెలిపారు.

ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ప్రజలు మళ్లీ చంద్రబాబు నాయకత్వంలోని పాలనను కోరుకుంటున్నారని ఎమ్మెల్యే షాజహాన్ భాషా పేర్కొన్నారు.

కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *