మదనపల్లి, ఆగస్టు 15: (gtvmedia)మహిళను వేధించి వేటకొడవలితో దాడికి యత్నించిన ఘటనలో రాజేష్ అనే వ్యక్తిని మదనపల్లి తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. బొమ్మనచెరువులో జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

తాలూకా ఎస్ఐ ఎం. విష్ణునారాయణ ఆధ్వర్యంలో నిందితుడిని అరెస్ట్ చేసి అనంతరం కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిని పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు.
కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆకతాయిల వేధింపులు ఎదురైతే మహిళలు భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, పోలీసులు అండగా ఉంటారని తెలిపారు.
