న్యూఢిల్లీ, ఆగస్టు 12: (gtvmedia)స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో నగరవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు.
ఇండియన్ ముజాహిదీన్, అల్ఖైదా, ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలకు చెందిన 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలతో పోస్టర్లు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఆయా వ్యక్తుల వివరాలను పోస్టర్లలో పొందుపరిచి.. వారు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు సూచించారు.
మరోవైపు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగే ఎర్రకోట వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఆగస్టు 15న జరిగే వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 15 వేల నుంచి 20 వేల మంది పోలీసులు, పారామిలటరీ సిబ్బందిని మోహరించనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రధాన ప్రాంతాలు, కీలక ప్రదేశాల్లో నిఘాను పెంచడంతో పాటు భద్రతా తనిఖీలను ముమ్మరం చేశారు.
