మదనపల్లె, సెప్టెంబర్ 3: జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మదనపల్లి పట్టణ ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించుటకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.
జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మదనపల్లి ప్రాంతంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల సామర్థ్యాన్ని తాత్కాలికంగా పెంచాలని నిర్ణయించడం జరిగింది.

అందులో భాగంగా:
1. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ చెరువు సామర్థ్యాన్ని 30 MCFT నుండి 40 MCFT కు
2. గుంటివారిపల్లి సమ్మర్ స్టోరేజ్ చెరువు సామర్థ్యాన్ని 40 MCFT నుండి 50 MCFT కు పెంచడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది
దీని ద్వారా మొత్తం 90 MCFT నీటిని నిల్వ చేసి, మదనపల్లి ప్రజలకు వచ్చే 9 నెలల పాటు అనగా జూన్ 2027 వరకు తాగునీటి కొరత లేకుండా సరఫరా చేయడం జరుగుతుంది.
ప్రస్తుతం సమ్మర్ స్టోరేజ్ చెరువులలో Off Take Point (నీటిని తీసుకునే ప్రదేశం) చెరువు FRL (పూర్తి నీటి నిల్వ మట్టం) కన్నా దిగువన ఉండటం వలన పూర్తి సామర్థ్యం వినియోగంలోకి రావడం లేదు. కావున చెరువులను లోతు చేసి, పూడిక తీసి అదనపు నీటిని నిల్వ చేసే విధంగా పనులు చేపట్టడం జరుగుతుంది.

ట్యాంకుల్లో పెద్ద ఎత్తున నిర్మాణ వ్యర్థాలు (కన్స్ట్రక్షన్ డెబ్రిస్) అక్రమంగా వేయడం వల్ల తీవ్రమైన సమస్యగా మారుతోంది. ట్యాంకుల్లో చెత్త లేదా నిర్మాణ వ్యర్థాలను వేయకుండా ప్రజలందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.
భవిష్యత్తులో ఈ ట్యాంకులు తాగునీటికి జీవనాధారంగా నిలవనున్నాయి. కాబట్టి వీటిని పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత. మన విలువైన నీటి వనరులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.
ఇకపై నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి.
ఈ సమ్మర్ ట్యాంకుల్లో నిర్మాణ వ్యర్థాలు, చెత్త లేదా ఇతర వ్యర్థాలను డంపింగ్ చేస్తున్నట్లు గుర్తించిన ఏ ట్రాక్టర్నైనా వెంటనే సీజ్ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు.
పై పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయుటకు జిల్లా యంత్రాంగం మరియు జలవనరుల శాఖ అధికారులకు కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడమైనది.
