మదనపల్లె, ఆగస్టు 13: (gtvmedia)అన్నమయ్య జిల్లాలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ (Special Intensive Revision) కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఆగస్టు నెలలో నాలుగు ప్రత్యేక ప్రచార దినాలను కేటాయించినట్లు ఇన్చార్జి కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు.
గురువారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆయా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్ఓలు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఓటర్ల నుంచి కొత్తగా పేర్ల చేర్పులు, అభ్యంతరాలు, క్లెయిమ్లను బీఎల్ఓలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద ముసాయిదా ఫొటో ఓటరు జాబితా అందుబాటులో ఉంటుందని, ప్రజలు తమ ఓటు వివరాలను పరిశీలించుకోవచ్చని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలని, ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత తేదీల్లో బీఎల్ఓలకు తెలియజేయాలని ఇన్చార్జి కలెక్టర్ సూచించారు.
