మదనపల్లి, ఆగస్టు 12: ఎన్డీఏ కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని కూటమి తరపున ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
కూటమి అభిమానుల ముసుగులో సోషల్ మీడియాలో కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా పోస్టులు, వ్యాఖ్యలు చేసే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మూడు పార్టీల మధ్య ఐక్యతకు భంగం కలిగించేలా, నాయకులు–కార్యకర్తల మధ్య అపోహలు, విభేదాలు సృష్టించే ప్రయత్నాలను ప్రోత్సహించవద్దని కోరారు.
సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి సమాచారాన్ని నమ్మకుండా, వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలని సూచించారు. వ్యక్తిగత విమర్శలు, పరస్పర ఆరోపణలకు దూరంగా ఉంటూ కూటమి ఐక్యతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు.
ఎన్డీఏ కూటమి బలం మూడు పార్టీల ఐక్యతలోనే ఉందని, కూటమి స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించే వారిని గుర్తించి అప్రమత్తంగా ఉండాలని నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
