ప్రసూతి తల్లులకు ఉచిత రవాణా సేవలు
మదనపల్లె, ఆగస్టు 11: (gtvmedia)మాతా శిశు సంరక్షణలో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “తల్లి–బిడ్డ ఎక్స్ప్రెస్” సేవలను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే యం. షాజహాన్ భాష, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ కలిసి ఈ సేవలను ప్రారంభించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం తల్లులు, నవజాత శిశువులను ఎలాంటి చార్జీలు లేకుండా వారి ఇళ్లకు సురక్షితంగా చేర్చేలా తల్లి–బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ.. మాతా శిశు సంరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రసవం అనంతరం తల్లి, బిడ్డలు ఇంటికి చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు.
అన్నమయ్య జిల్లాకు మొత్తం 12 తల్లి–బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రభుత్వం అందించగా, మదనపల్లె ప్రాంతంలో 6 వాహనాలు అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సేవలను ప్రసూతి తల్లులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
తల్లి, బిడ్డల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

