మట్టి విగ్రహాలు పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం
మదనపల్లి,సెప్టెంబర్ 12:వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాష పిలుపునిచ్చారు. మదనపల్లి పట్టణంలోని సాయిబాబా గుడి వద్ద మాజీ కౌన్సిలర్ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
స్థానిక నాయకులతో కలిసి ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

మాజీ కౌన్సిలర్ గాంధీ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే అభినందించారు. మట్టి విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణానికి హాని కలగకుండా పండుగను నిర్వహించవచ్చని తెలిపారు. ప్రజలు మట్టి విగ్రహాలను వినియోగించడాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
నియోజకవర్గ ప్రజలందరూ సంతోషంగా, భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పండుగను జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
