అంతటి బురదలో 350 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన సైనికులు
నేపాల్: భారీ వరదలతో అతలాకుతలమైన నేపాల్లో ఆ దేశ ఆర్మీ చేపట్టిన సహాయక చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి. రసువా జిల్లాలోని అప్పర్ త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న 350 మంది కార్మికులు, స్థానికులను నేపాల్ ఆర్మీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది.
భారీ వర్షాలు, ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య సొరంగంలోకి వెళ్లి సైనికులు సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అయితే మరో 100 మందికి పైగా వ్యక్తులు సొరంగంలో చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వారిని కూడా సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు సహాయక, రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రాణాలను లెక్కచేయకుండా క్లిష్ట పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన నేపాల్ ఆర్మీ సిబ్బందిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
