రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేకే ఆరోపణలు

జ్ఞానజ్యోతి డిజిటల్‌ పత్రికతో నాకు ఎలాంటి సంబంధం లేదు

ఆరోపణలు రుజువు చేయకపోతే పరువు నష్టం దావా: ఆర్‌.గురుప్రసాద్‌

మదనపల్లె, ఆగస్టు 23: (gtvmedia)తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే వైసీపీ నాయకులు తనపై, తాను నిర్వహిస్తున్న విద్యాసంస్థపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ ఆర్‌.గురుప్రసాద్‌ ఆరోపించారు. జ్ఞానజ్యోతి డిజిటల్‌ పత్రికతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

తనకు ఎలాంటి సంబంధం లేని పత్రికలో ప్రచురితమైన వార్తను ఆధారంగా చేసుకుని వైసీపీ నాయకుడు గుండ్లూరు రఫీ, జ్ఞానజ్యోతి డిజిటల్‌ పత్రిక తనదేనంటూ వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరమని గురుప్రసాద్‌ పేర్కొన్నారు.

జ్ఞానజ్యోతి డిజిటల్‌ పత్రికకు తాను ఎడిటర్‌గా గానీ, పబ్లిషర్‌గా గానీ వ్యవహరిస్తున్నట్లు ఎక్కడా ప్రకటించలేదని ఆయన స్పష్టం చేశారు. తనకు సంబంధం లేని మీడియా సంస్థను తనకు ఆపాదిస్తూ బహిరంగంగా వ్యాఖ్యానించడం ద్వారా తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.

రాజకీయ నాయకులు ప్రెస్‌మీట్లలో మాట్లాడే సమయంలో వాస్తవాలను నిర్ధారించుకుని, ఆధారాలతోనే విమర్శలు చేయాలని గురుప్రసాద్‌ సూచించారు. వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉంటే బహిర్గతం చేయాలని ఆయన సవాల్‌ చేశారు. ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమైతే గుండ్లూరు రఫీపై పరువు నష్టం దావాతో పాటు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాజకీయ విమర్శలు రాజకీయాలకే పరిమితం కావాలని, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం తగదని గురుప్రసాద్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులో తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *