మదనపల్లె ఆగస్టు 11: (gtvmedia)మదనపల్లె మండలం వేంపల్లె గ్రామ పరిధిలో ప్రభుత్వ భూములైన వాగు, కాలువలను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తుండటంపై బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మండల తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్కు ఆయన వినతిపత్రం అందజేశారు.
వేంపల్లె గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 740, 738, 736 ప్రైవేటు భూముల పక్కనే ఉన్న సర్వే నెం. 735 (వాగు) మరియు సర్వే నెం. 737 (కలువ/కాలువ) ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లుగా విక్రయిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వాగులను పూడ్చివేయడం వల్ల భవిష్యత్తులో వర్షపు నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడి, చుట్టుపక్కల రైతుల భూములు మరియు నివాసాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
వెంటనే రెవెన్యూ, సర్వే అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన జరిపించి, ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మరియు అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని పునీత్ కుమార్ డిమాండ్ చేశారు.

