మదనపల్లె, ఆగస్టు 11: (gtvmedia)అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇద్దరు విద్యార్థులు కత్తులతో పరస్పరం దాడి చేసుకున్న ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం.. బొంబు బజారులో నివాసం ఉంటున్న అమీర్ బాష కుమారుడు ఆఫ్సాన్ (20), తాళ్ల సుబ్బన్న కాలనీలో నివాసం ఉంటున్న షమీవుల్లా కుమారుడు సాదిక్ (22) మిషన్ కాంపౌండ్ ఎదురుగా ఉన్న విశ్వహిత డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు.
ఇద్దరూ శేష మహల్కు దక్షిణ వైపున ఉన్న మడికయల్లోకి సరదాగా వెళ్లిన సమయంలో వారి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ముందుగానే తమ వెంట తెచ్చుకున్న కత్తులతో ఇద్దరూ పరస్పరం దాడి చేసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనలో గాయపడిన ఇద్దరినీ స్థానికులు వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించడంతో ప్రస్తుతం ఇద్దరూ కోలుకుంటున్నట్లు సమాచారం.
ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గొడవకు అసలు కారణం ఏమిటనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.
