ఆరోగ్యవరం, ఆగస్టు 2: చారిత్రాత్మక ఆరోగ్యవరం ఫుట్బాల్ మైదానం పునరుద్ధరణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఎన్నో తరాల క్రీడాకారులను తీర్చిదిద్దిన ఈ మైదానం మళ్లీ యువత అడుగులతో కళకళలాడేందుకు సిద్ధమైంది.
జాతీయ రహదారి విస్తరణతో మైదానంలో కొంత భాగం కోల్పోయినప్పటికీ, దాని క్రీడా వారసత్వాన్ని కాపాడాలనే లక్ష్యంతో ట్రినిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వ్యవస్థాపకులు నేషి, జి. రతీష్ బాబు తమ స్వంత నిధులతో పునరుద్ధరణ పనులను చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రాజేష్ సువార్త, ప్రభా, ఆర్.ఎం. సునీల్, స్టాన్లీ కమలేశన్, టీ. లక్ష్మీపతి, జి. సుధాకర్, దినకర్ మోల్డ్, జాన్ వెస్లీ తదితరులు పనుల పర్యవేక్షణతో పాటు యువతను సమన్వయం చేస్తూ విశేష సహకారం అందించారు.
పునరుద్ధరణ పూర్తైన నేపథ్యంలో మైదానం ఇకపై సాధన, స్నేహపూర్వక మ్యాచ్లు మరియు టోర్నమెంట్ల నిర్వహణకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా పునరుద్ధరణ కమిటీ సభ్యులు, ఈ కార్యక్రమానికి అనుమతులు మరియు ప్రోత్సాహం అందించిన CSI రాయలసీమ డయాసిస్ బిషప్ & ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ (AMC) చైర్మన్ ది రైట్ రివ. డా. పి. ఐజాక్ వర ప్రసాద్ , అలాగే AMC ఇన్చార్జ్ డైరెక్టర్ డా. కె. పి. రవీంద్ర కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
“ఆరోగ్యవరం అంటే TB వైద్యసేవలకు ప్రపంచ గుర్తింపు… ఆరోగ్యవరం ఫుట్బాల్ మైదానం అంటే ప్రతిభకు, క్రమశిక్షణకు, ఐక్యతకు చిరునామా.”
