పశువుల మేతకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి: ఎంపీ మిథున్ రెడ్డి
మదనపల్లె, సెప్టెంబర్ 2:
ఎల్నినో ప్రభావంతో అన్నమయ్య జిల్లా కరువు పరిస్థితుల వైపు పయనిస్తున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను కోరినట్లు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తెలిపారు.
బుధవారం స్థానిక కలెక్టరేట్లో ఎంపీ మిథున్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు అందే నిధులను ఏయే శాఖలకు ఎంత మేర కేటాయించాలి అనే అంశంపై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా కరువు పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
అలాగే పశువులకు మేత కొరత ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన పశువుల దాణాను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని పశువులకు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులతో చర్చించినట్లు ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు.
జిల్లాలో ప్రజలకు తాగునీరు, పశువులకు మేత విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
