మదనపల్లె: సెప్టెంబర్ 8 అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ప్రసిద్ధ బసినికొండ గంగమ్మ ఆలయంలో మంగళవారం వేకువజామున భారీ చోరీ జరిగింది. హెల్మెట్లు ధరించి వచ్చిన దుండగులు ఆలయ ఇనుప తలుపులను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించినట్లు సమాచారం.
ఆలయంలోని హుండీని పగలగొట్టి అందులో ఉన్న నగదుతో పాటు అమ్మవారి బంగారు ఆభరణాలను దొంగలు అపహరించినట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడే హెల్మెట్ను వదిలి పరారైనట్లు సమాచారం.
చోరీ ఘటన వెలుగులోకి రావడంతో ఆలయ పరిసరాల్లో కలకలం రేగింది. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ దొంగలను గుర్తించే పనిలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చోరీకి గురైన నగదు, బంగారు ఆభరణాల విలువ ఎంత అన్నది పోలీసుల దర్యాప్తు అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
