కృత్రిమ మేధస్సుతో కొత్త ఆవిష్కరణలు, విస్తృత అవకాశాలు

మదనపల్లె, ఆగస్టు 8: (gtvmedia)కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా భవిష్యత్తులో అనేక కొత్త ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ డైరెక్టర్ డా. ఎస్. రామలింగారెడ్డి పేర్కొన్నారు.

మదనపల్లెలోని ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగం ఆధ్వర్యంలో శనివారం ‘కృత్రిమ మేధస్సు – ఆవిష్కరణలు, అవకాశాలు’ అనే అంశంపై సాంకేతిక ప్రసంగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మూడో సంవత్సరం బీటెక్ కంప్యూటర్ సైన్స్‌తో పాటు అనుబంధ విభాగాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన ప్రముఖ సాంకేతిక నిపుణుడు, KYDRE సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ వ్యవస్థాపకుడు ఎం. గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సు రంగంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు, నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక రంగంలో AI వినియోగం, ఉపాధి అవకాశాలు, భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న ఉన్నత ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

AI రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యాలతో పాటు సృజనాత్మక ఆలోచనా విధానం, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించుకోవాలని గంగాధర్ రెడ్డి సూచించారు. కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడంతోనే పరిమితం కాకుండా, దానిని సమాజానికి ఉపయోగపడే నూతన పరిష్కారాల రూపకల్పనకు వినియోగించాలని అన్నారు.

ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ఆర్. రామమోహన్ రెడ్డి, అధ్యక్షులు ఎం. నాగమల్ల రెడ్డి, డైరెక్టర్ డా. ఎస్. రామలింగారెడ్డి, ప్రిన్సిపాల్ డా. రాయుడు పెయ్యలపాల విద్యార్థులను అభినందించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరిశోధన, ఆవిష్కరణలపై దృష్టి సారించాలని, పారిశ్రామిక రంగ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగాధిపతి, కార్యక్రమ సమన్వయకర్త డా. ఎం. రోషిణి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ సమన్వయకర్త డి. రామకాంత్, సహాయ ఆచార్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *