మదనపల్లి, సెప్టెంబర్ 8: ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కొత్త పింఛన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ సూచనల మేరకు మంగళవారం మధ్యాహ్నం బసినికొండ–1, కొండమర్రిపల్లి గ్రామ సచివాలయాలను (స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాలు) ఆమె తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పింఛన్ లబ్ధిదారులు, ప్రజలతో మాట్లాడి పథకం ప్రయోజనాలు పొందడంలో ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులు, ఫిర్యాదులపై వివరాలు తెలుసుకున్నారు. సచివాలయాల ద్వారా అందుతున్న సేవలు, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను సమీక్షించారు.స్వీకరించిన దరఖాస్తుల వివరాలను రిజిస్టర్లో క్రమబద్ధంగా నమోదు చేయాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ప్రతి దరఖాస్తుపై తీసుకున్న చర్యలు, సంబంధిత వ్యాఖ్యలను నమోదు చేయాలని, దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డి ఎస్ డబ్ల్యూ అమర్నాథ్ రెడ్డి, డిప్యూటీ ఎంపీడివో తిరుపాల్ నాయక్, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
