25 మందికి పైగా యువతులపై బ్లాక్మెయిలింగ్!
పోలీస్ స్టేషన్ ఎదుట బాధితురాలు ఆవేదన
మదనపల్లె, సెప్టెంబర్ 8:
ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను నమ్మించి నగదు, బంగారం కాజేయడమే కాకుండా.. వారి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని ఓ మాయగాడు బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారంటూ ఓ యువతి చేసిన ఆరోపణలు మదనపల్లెలో కలకలం రేపుతున్నాయి. తనను కూడా పెళ్లి చేసుకుని అదనపు కట్నం పేరుతో డబ్బులు, బంగారం తీసుకున్నారని బాధితురాలు దివ్య ఆరోపించారు.
ఇలా 25 మందికి పైగా యువతులు బాధితులుగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
బాధితురాలి కథనం మేరకు.. మదనపల్లెకు చెందిన లోహిత్ తో గత ఏడాది సెప్టెంబరులో ఆమెకు వివాహమైంది. పెళ్లయిన కొద్దిరోజులకే అదనపు కట్నం కోసం భర్త లోహిత్, మామ, అత్త , మరిది వేధింపులకు గురిచేశారని ఆరోపించారు.
అలాగే తన మాదిరిగానే సుమారు 25 మందికి పైగా యువతుల వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సేకరించి వారిని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని దివ్య ఆరోపించారు.
ఈ ఘటనపై ఎస్పీ ఆదేశాలతో జూలై 13న మదనపల్లె వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందని బాధితురాలు తెలిపారు.
అయితే కేసు నమోదైనప్పటికీ నిందితులపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
తనకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
